టీచర్ పోస్టుల భర్తీ : టెట్ పరీక్షకు సన్నాహాలు
టెట్ (టీచర్ ఎలిజిబులిటీ) పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహాలు మొదలు పెట్టింది. టీచర్ పోస్టుల భర్తీ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ, చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించింది. ఆమొదం రాగానే ఒక వారంలోపే నోటిఫికేషన్ విడుదల చేసి టెట్ పరీక్ష నిర్వహించనుంది. ఏప్రిల్ నెలాఖరు లేదా మే ఫస్ట్ వీక్లో టెస్ట్ ఉండొచ్చు అని అంచనా. 45రోజుల ప్రిపరేషన్ టైం ఉంటుంది.
ఎన్సీటీఈ రూల్స్ ప్రకారం దేశవ్యాప్తంగా టీచర్ పోస్టుల భర్తీకి టెట్ నిర్వహణ జరుగుతుంది. 2011లో ఈ పరీక్ష మొదలైన దగ్గరనుంచి రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ నియామాక పరీక్షకు టెట్లో అర్హత పొందిన వారినే అనుమతించారు.
ఈ ఎలిజిబులిటీ టెస్ట్లో మొత్తం 150 మార్కులకుగానూ జనరల్ అభ్యర్థులు 90 మార్కులు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 60 మార్కులు సాధిస్తే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాసేందుకు అర్హత పొందినట్టే. తెలంగాణాలో చివరిసారిగా 2017లో టెట్ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత అనేకమార్లు టెట్ నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసినా.. ఉపాధ్యాయ నియామకాలు లేనందున ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు.

రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారు సుమారు 5లక్షల వరకు ఉన్నారు. వారిలో డీఈడీ(టీటీసీ) అభ్యర్థులు 1.5లక్షల మంది. బీఈడీ అభ్యర్థులు సుమారు 3.5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో గతంలో టెట్ అర్హత సాధించిన వారు 2.5లక్షల మంది ఉన్నట్టు అంచనా. వీరందరూ టెట్ నోటిఫికేషన్ ఎదురుచూస్తున్నారు.
ఇదివరలో టెట్ ఎగ్జామ్ వ్యాలిడీటీ ఏడేళ్లు మాత్రమే ఉండేది, డీఈడీ చేసిన వారికి మాత్రమే పేపర్–1 రాసేందుకు అర్హత ఉండేది. కానీ తాజాగా దానికి లైఫ్టైమ్ వ్యాలిడిటీ ఇస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు ఇప్పుడు బీఈడీ చేసిన వారికి కూడా ఈ పరీక్షకు హాజరయ్యే అర్హత లభించింది. ఈ రెండు అంశాలను సవరించాలని కోరుతూ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. వీటికి ఆమోదం లభించగానే రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది.