మితిమీరుతున్న విద్వేషం : ఆలయ పూజారులపై ఎఫ్ఐఆర్
ఘజియాబాద్కు చెందిన దస్నా ఆలయ ప్రధాన పూజారి యతి నరసింగానంద్ పోయిన సంవత్సరం డిసెంబరులో హరిద్వార్లో విద్వేష ప్రసంగం చేసినందుకు గానూ అరెస్టయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అదే తరహా వ్యాఖ్యలు చేసి మరో వివాదానికి తెర లేపాడు. మన దేశానికి ఒక హిందూయేతరుడు ప్రధాని అయితే గనక రాబోయే ఇరవై ఏళ్లలో దేశంలో హిందువులే ఉండరని, అందుకే హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనకపోతే దేశంలో హిందువులే లేకుండా పోతారని గురువారం గోవర్ధన్లో చేసిన ప్రసంగంలో అన్నాడు.
తమ ఉనికి కోసం హిందువులు ఆయుధాలు చేపట్టాలని కూడా పిలుపిచ్చారు. హిందువులను మేల్కొలిపేందుకు ఆగస్టు 12-14 మధ్య మథు-గోవర్ధన్ ప్రాంతంలో ధర్మసంసద్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు మళ్ళీ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఒకసారి అరెస్ట్ అయినా ఆయన వైకరిలో ఏమాత్రం మార్పు రాకపోగా మరింతగా విద్వేష వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు.
ఇది ఇలా ఉంటే “ఖైరాబాద్లో ఎవరైనా ముస్లిం హిందూ మహిళల వెంట పడితే వారి కుమార్తెను, కోడలిని కిడ్నాప్ చేసి బహిరంగంగా అత్యాచారం చేస్తానని యూపీలోని సీతాపూర్లో స్థానిక ఆలయ పూజారి మహంత్ ముని చేసిన వ్యాఖ్యల వీడియో కూడా వైరల్ అవుతోంది. హిందూ మతాన్ని నిలబెట్టటానికి పనిచేస్తున్నందున, కొందరు తనని హత్యచేయటానికి కుట్ర పన్నారని.దానికోసం రూ.28 లక్షల రూపాయలు సమకూర్చుకున్నారని కూడా బజరంగ్దాస్ అన్నాడు.
‘ఆల్ట్న్యూస్’ అనే వెబ్సైట్ సహవ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్ 41 సెకన్లపాటు ఉన్న ఈ వీడియో క్లిప్ను ట్విటర్లో షేర్ చేస్తూ. ఏప్రిల్ రెండున బజరంగ్దాస్ ఈ వ్యాఖ్యలు చేసినా ఇప్పటివరకూ అతని మీద ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు.
ఆ ట్వీట్కు స్పందించిన సీతాపూర్ పోలీసులు ఇప్పుడు బజరంగ్దాస్ మహంత్పై కేసు నమోదుచేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేసిన బజరంగ్దాస్ మీద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ లేఖ రాశారు.